వృద్ధాప్య పింఛన్ తీసుకొని భోజనాలు, వసతి కల్పన..
మందులు,ఇతర ఖర్చులకు డబ్బులు ఇవ్వని కొంతమంది ఆశ్రమ నిర్వాహకులు….
.
వారంతా వృద్దులు…జీవిత చరమాంకంలో ఉన్నవారు. వారి ఆలనా.. పాలన చూడాల్సిన పిల్లలు బాధ్యతలను మరచి తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ఒంటరిగా వదిలేస్తున్నారు. ఇలాంటి వారి కోసం సమాజ సేవకై వృద్ధాశ్రమాలు నడుపుతున్నామని చెబుతున్నా, కొంత మంది నిర్వాహకులు మానవత్వం మరచి వ్యహరిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఆనారోగ్య సమయంలో ఆసుపత్రి ఖర్చులు, రోజు వారి మందులు కోసం దాచుకుంటున్నా వృద్ధాప్య పింఛన్ల నగదు తీసుకుంటూ నాసిరకం భోజనం, వసతి కల్పిస్తున్నారనే ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి.
పల్నాడుకు ముఖ్య ద్వారంగా సత్తెనపల్లి పరిసర ప్రాంతాలలో కొంత మంది పలు వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేశారు. కొంత సొంత నగదు తో పాటు దాతల సహకారంతో వృద్దులకు భోజనం, వసతి తదితర సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈనేపథ్యంలో గతంలో వివిధ రకాల వేడుకలు కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల నడుమ జరుపుకునే వారు. అయితే ఇటీవల స్మార్ట్ ఫోన్, సొషల్ మీడియా తదితర విప్లవాత్మకమైన మార్పుల్లో భాగంగా ప్రజల జీవన ప్రమాణాల్లో పలు మార్పులు సంతరించుకున్నాయి. కారణంగా జన్మదినం, వివాహ వేడుకల రోజు, ఆదరణ కూడిక, వివిధ పార్టీ నాయకులకు సంబందించిన కార్యక్రమాలు అనాధలు, వృద్ధుల నడుమ చేసుకుంటున్నారు. వారికి ఒక పూట భోజనం పెట్టటం, నగదు, వివిధ సౌకర్యాలు సమకూర్చే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది.
ఆశ్రమాలపై కొరవడిన పర్యవేక్షణ.
ఆశ్రమాలపై అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో చాలా మంది వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. ప్రధానంగా వృద్ధాప్య పింఛన్లు కొంతమంది ఆశ్రమం నిర్వాహకులు తీసుకుంటున్నారని ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి . అనారోగ్య సమయంలో ఆసుపత్రి ఖర్చులు, రోజువారి మందులకు వందల్లో ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని సమాచారం.అంతేకాకుండా దాతలు తెచ్చే భోజనాలు ఎక్కువ మొత్తంలో నిర్వాహకులు వారింటికి తీసుకెళుతూ వీరికి మాత్రం అరకొర వడ్డిస్తున్నారని తెలుస్తోంది. దాతలు కోడి,వేట తదితర కూరలు పంపించిన సమయంలో నిర్వాహకులు ఎక్కువ మొత్తంలో వారింటికి చేరవెస్తూ వృద్ధులకు మాత్రం చారు వడ్డిస్తున్నారని చర్చించుకుంటున్నారు.పేరుకు సమాజ సేవ చేస్తున్నామని చెప్పుకుంటూ…ఇలా వృద్దులను కొంతమంది ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలుస్తోంది.దీంతో ఒకపక్క తమ పిల్లలు, మరొకపక్క కొంతమంది ఆశ్రమ నిర్వాహకుల చేతుల్లో వృద్ధులు మోసపోతున్నారు .ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆయా ఆశ్రమాలపై నిరంతర పర్యవేక్షణ ఉంచాలి. అదేవిధంగా ఆశ్రమ నిర్వాహకులు వృద్ధాప్య పింఛన్లు తీసుకోకుండా కట్టడి చేయాలని పలువురు కోరుతున్నారు….