రాపిడో బైక్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..యువతి మృతి!
సెల్ఫోన్ రిపేర్ చేయించుకునేందుకు వెళ్తుండగా చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో 26 ఏళ్ల యువతి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన శనివారం అమీర్పేట్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన వి. హేమదుర్గ (26) నగరంలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో నివాసముంటూ బంజారాహిల్స్లోని ఓ కార్ల షోరూమ్లో ఉద్యోగం చేస్తోంది. తన మొబైల్ ఫోన్ పాడవడంతో దాన్ని బాగు చేయించుకునేందుకు ఆఫీస్ నుంచి అనుమతి తీసుకుని రాపిడో బైక్పై అమీర్పేట్కు బయలుదేరింది.
శ్రీనగర్ కాలనీలోని బిగ్ బజార్ వెనుక గేటు సమీపానికి చేరుకోగానే, వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఆమె ప్రయాణిస్తున్న రాపిడో బైక్ను బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో హేమదుర్గ అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు డ్రైవర్ షేక్ అన్వర్పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు, ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

